ప్రజాపక్షం / హైదరాబాద్ జిల్లా ప్రతినిధి
హైదరాబాద్ నగరానికి చెందిన ఒక బిటెక్ విద్యార్థి మత్తుకు బానిస అయ్యి అధిక మో తాదులో డ్రగ్స్ సేవించి మరణించిన ఘటన కలకలం రేపింది. నగరంలో డ్రగ్స్ ఎక్కువై మరణించిన తొలిఘటన ఇదేనని భావిస్తున్నారు. రెండురోజుల క్రితం నల్లకుంట పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి రెండు కేసుల్లో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశా రు. వారిలో నల్లకుంట ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్న ప్రేమ్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. అతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం… ఈ నలుగురూ తరచూ గోవా వెళ్తుండేవారు. ఈ నలుగురితో కలిసి మరో బీటెక్ విద్యార్థి గోవా వెళ్లాడు. ఆ విద్యార్థి వివిధ రకాల డ్రగ్స్ను ఒకేసారి సేవించాడు. మోతాదు ఎక్కువై విద్యార్థికి మెదడు స్తంభించి వింతగా ప్రవర్తించాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించినా కోలుకోలేదు. చికిత్స పొందుతూనే రెండు రోజుల క్రితం మరణించాడు. ఆ యువకునితో పాటు గోవాకు వెళ్లిన మిగతా యువకులు కూడా అనారోగ్యం పాలైనట్టు సమాచారం. మరణించిన విద్యార్థిని చికిత్స అందించిన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం అతను చేరినప్పుడు వైద్యులకు పరిస్థితి అర్థం కాలేదని, అతని స్నేహితులను కనుక్కుంటే డ్రగ్స్ విషయం బైటపడిందని తెలిసింది . ఈ నెల 19న ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చేర్పించారని, స్నేహితులతో మాట్లాడితే కాని, వివిధ డ్రగ్స్ వాడినట్లు తెలుసుకోగలిగామన్నారు. డ్రగ్స్ మోతాదు మించిపోవడంతో ఆ యువకుడు బ్రెయిన్ స్ట్రోక్కు గురై వంటిలోని అవయాలు పని చేయడం నిలిచిపోయాయని, ఏళ్లుగా మత్తు పదార్ధాలు సేవిస్తుండటం వల్లే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఈ నెల 23న ఆ యువకుడు మృతి చెందినట్లు వెల్లడించారు. కాగా ఘటనపై హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సిపి డి.ఎస్. చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ మాదకద్రవ్యాలను కట్టడి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని, బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనలో. పరారీలో ఉన్న కీలక నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు.
డ్రగ్స్ కోసం ఇళ్లే ల్యాబ్గా….
జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడిన శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీరామ్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చదువుకునే రోజుల్లోనే మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతను… ఉద్యోగం లేక చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చివరికి తానే మత్తు మందు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడు. హిమాలయాలు, రిషికేష్ తదితర ప్రాంతాలకు వెళ్లి విదేశీ పర్యాటకుల నుంచి డీఎంటీ తయారీ విధానం తెలుసుకున్నాడు. అందుకు కావాల్సిన ముడి సరకును కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేశాడు. మరి కొన్ని రసాయనాల కోసం ఎవరికీ అనుమానం రాకుండా దుకాణాల వద్దకు ఒక కెమిస్ట్రీ విద్యార్థి లాగా వెళ్లి ప్రాక్టికల్స్ కోసం అవసరమని చెప్పి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో కొండాపూర్లో ఉంటున్న తన ఇంటినే ల్యాబ్గా మార్చాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మత్తు మందు తయారీలో సక్సెస్ అయ్యాడు. తొలుత తనతో పాటు స్నేహితులపై పరీక్షించి డ్రగ్స్ పనిచేస్తున్నాయని నిర్ధారణకు వచ్చాడు. ఒక గ్రాముతో 20 మందికి కిక్కు ఇస్తుందని స్వయంగా తెలుసుకున్నాడు. ఆ మత్తు పదార్థాన్ని సేవించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. తాను తయారు చేసిన డ్రగ్ ఆవిరి రూపంలో ఓ పరికరం నుంచి సేవించాలని వినియోగదారులకు తెలిపాడు. ఇతనికి పరిచయం అయిన… సాఫ్ట్ వేర్ కంపెనీలో కస్టమర్ సర్వీసు ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న దీపక్కు కూడా విక్రయించాడు. క్రమంగా డిమాండ్ పెరగడంతో ఒక గ్రాము రూ.8వేల చొప్పున విక్రయించడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ విక్రయిస్తున్న క్రమంలో శ్రీరామ్తో పాటు దీపక్ అనే వినియోగదారుడిని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసింది. వీరి నుంచి 8 గ్రాముల డీఎంటీ డ్రగ్, తయారీ పరికరాలు, రెండు మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంటిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్, అందులో ఉన్న పరికరాలు చూసి అవాక్కయ్యారు.
మత్తుకు బానిసై బిటెక్ విద్యార్థి మృతి
RELATED ARTICLES