HomeNewsBreaking Newsభారత్‌కు చావోరేవో..

భారత్‌కు చావోరేవో..

నేడు ఇంగ్లాండ్‌ మహిళలతో రెండో టి20
గువహాటి: ఇంగ్లాండ్‌తో గురువారం జరిగే రెండో టి20 టీమిండియాకు చావోరేవోగా మారింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్‌లో నిలవాలని ప్రయత్నిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 1 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ ఆ జోరును తొలి టి20 మ్యాచ్‌లో కనబర్చలేకపోయింది. మొదట బౌలర్లు, తర్వాత బ్యాట్స్‌మెన్స్‌ ఘోరంగా విఫలమవడంతో భారత్‌కు టి20ల్లో మరో ఓటమి తప్పలేదు. తొల్తు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 119 పరుగులే చేయగలిగింది. టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ధాటిగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ లక్ష్యం పెద్దదిగా ఉండడంతో భారత్‌కు 41 పరగుల ఓటమి తప్పలేదు. వన్డేల్లో గొప్ప ప్రదర్శనలు చేస్తున్న టీమిండియా టి20 సిరీసుల్లో మాత్రం తేలిపోతుంది. పొట్టి ఫార్మాట్‌లో జరుగుతున్న తప్పులను సవరించుకుంటే భారత్‌ ఓటముల పరంపర ఆగిపోతుందని విశ్లేషకుల అంచనా. టి20 రెగ్యూలర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆమె బదులు ఓపెనర్‌ స్మృతి మంధనా టీమిండియా పగ్గాలు అందుకుంది. ఇంగ్లాండ్‌తో సోమవారం జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో తొలిసారిగా టి20 జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన మంధనాకు చేదు అనుభవమే మిగిలింది. భారత ఆటగాళ్లు రెండు విభాగాల్లో విఫలమవడంతో ఘోర ఓటమి తప్పలేదు. ఇక గురువారం జరిగే మ్యాచ్‌లోనైన గెలిచి సిరీస్‌ను కోల్పోకుండా కాపాడుకోవాలని మంధనా సేన భావిస్తోంది. వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్న భారత బ్యాటర్లు టి20ల్లో మాత్రం తేలిపోతున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌ పర్యటనలోనూ వన్డే సిరీస్‌ గెలిచిన భారత జట్టు పొట్టి సిరీస్‌లో మాత్రం ఓటమిపాలైంది. ఇక టి20 వరల్డ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌కు ఈ ఫార్మాట్లో ఎదురులేదు. ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. కానీ, అందరూ కలిసి కట్టుగా రాణిస్తే పటిష్టమైన ఇంగ్లాండ్‌పై గెలవడం సాధ్యమే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో భారత ఆటగాళ్లు సమిష్టిగా ఆడాల్సిన సమయం ఉంది. వన్డేల్లో మాదిరిగా ఈ టి20 సిరీస్‌లోనూ తమ సత్తా చాటుకోని భారత్‌కు సిరీస్‌ అందించాలి.
మంధనాపైనే ఆశలు..
కెప్టెన్‌ స్మృతి మంధనాపైనే టీమిండియా అధిక ఆశలు పెట్టుకుంది. సిరీస్‌ కాపాడుకోవాలంటే హిట్టర్‌ మంధనా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె బ్యాట్‌ను ఝుళిపిస్తే తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉండదు. వన్డేల్లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌లో ఉన్న స్మృతి మంధనా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించింది. ప్రస్తుతం మంచి ఫామ్‌లోనూ ఉంది. సోమవారం జరిగిన తొలి టి20లో మంధనా (2) పరుగులకే ఔటైంది. ఇక గురువారం జరిగే రెండో టి20లో మాత్రం తిగిన పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన యువ క్రీడాకారిణి హర్లీన్‌ డియోల్‌ (8) ధాటిగా ఆడినా పెద్ద స్కోరు చేయడంలో విఫలమైంది. మరోవైపు జెమీమా రొడ్రిగ్స్‌ కూడా వరుసగా విఫలమవడం టీమిండియాను కలవరపెడుతుంది. ఓపెనర్లు శుభారంభాన్ని అందిస్తే తర్వాతి బ్యాట్స్‌వుమెన్స్‌పై అధిక భారం ఉండదు. ఇక దీప్తి శర్మ, సీనియర్‌ మిథాలీ రాజ్‌, వేద కృష్ణమూర్తిలు రాణించాల్సిన సమయం వచ్చింది. మెరుగైన భాగస్వామ్యాలు ఏర్పర్చుతూ ముందుకు సాగితే ప్రత్యర్థి ముందు మంచి టార్గెట్‌ ఉంచగలం. మరోవైపు లక్ష్యఛేదనకు దిగిన సునాయాసంగా గెలవచ్చు. భారత్‌కు సిరీస్‌ దక్కాలంటే అందరూ తమ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్థించాలి. అప్పుడే బలమైన ప్రత్యర్థిని సునాయాసంగా ఓడంచవచ్చు. బౌలింగ్‌ విభాగం అద్భుతంగా ఉన్న గత మ్యాచ్‌లో మాత్రం తేలిపోయారు. స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయాలి. మరోవైపు పెద్ద భాగస్వామ్యాలు ఏర్పర్చకుండా వారిని అడ్డుకోవాలి. రెండు విభాగాల్లో సమిష్టిగా రాణిసతే విజయం మనదే.
జోరుమీదున్నారు..
వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్‌ మహిళలు టి20 సిరీస్‌లో మాత్రం శుభారంభం చేశారు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌వుమెన్స్‌ ప్రస్తుతం బీకర ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్లు డానియల్‌ వ్యాట్‌, టామీ బియోమంట్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. తొలి టి20లో వీరిద్దరూ మొదటి వికెట్‌కి 89 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌కి శుభారంభాన్ని అందించారు. వ్యాట్‌ ధాటిగా ఆడి 34 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరగులు చేసింది. మరో ఓపెనర్‌ బియోమంట్‌ 57 బంతుల్లోనే 9 ఫోర్లతో 62 పరగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్య భూమిక వహించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా సొంతం చేసుకుంది. మరోవైపు ఇంగ్లాండ్‌ సారథి హీథర్‌ నైట్‌ కూడా మంచి ఫామ్‌లో ఉంది. కష్ట సమయాల్లో జట్టుకు అండగా నిలుస్తూ గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడుతున్నది. గత మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన హీథర్‌ 20 బంతుల్లోనే 7 ఫోర్లతో 40 పరుగులు చేసింది. ఇక నథాలియా స్కీవర్‌, ఆల్‌రౌండర్‌ బ్రంట్‌ కూడా మెరుగ్గా ఆడతుండడం ఇంగ్లాండ్‌కు కలిసి వస్తోంది. ప్రస్తుతం భారత్‌ కంటే పటిష్ట స్థితిలో కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ రెండో టి20లోనే సిరీస్‌ను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక రెండో టి20లో భారత బ్యాటర్లు రాణిస్తే మ్యాచ్‌ హోరాహోరీగా జరగడం ఖాయం.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments