రిజర్వాయర్లలో నిల్వలుండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు
రాష్ట్రంలో తాగు, సాగునీటికి లోటు రానీయకుండా చర్యలు
అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలో అటువంటి పరిస్థితి రానివ్వకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుండి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. రాష్ట్రం లో తాగు, సాగు నీటికి లోటు రానివ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో వర్షాపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ డిమాండ్ తదితర తాజా పరిస్థితులపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి లభ్యతా వివరాలను సిఎం కెసిఆర్కు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యతనిస్తూ గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ, మిడ్ మానేర్ను నింపాలన్నారు. అక్కడి నుండి లోయర్ మానేర్ డ్యాంకు సగం నీళ్ళను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పికి సగం నీళ్ళను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యపేట వరకు ఇటు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మినట్ టు మినట్ రిపోర్ట్ ఇవ్వండి
ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు వేసిన ప్రాంతాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే
పరిస్థితులున్నాయని, అటువంటి పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించేలా కంటిన్జెన్సీ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సిఎం స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతి రోజు మినట్ టు మినట్ రిపోర్టును సీఎం కార్యాలయానికి ప్రతి రోజు ఉదయాన్నే అందజేయాలని, ఇరిగేషన్ , వ్యవసాయ , విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల నుండి వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సీఎం కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేస్తుందని, తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా సమన్వయం చేస్తామని సిఎం తెలిపారు.
సంక్షోభంలోనూ పంటలు పండాలె..అప్పుడే మనం సిపాయిలం
సంక్షోభ సమయంలోనే మనం పంటలు పండించి చూపించాలని,అప్పుడే మనం సిపాయిలమని సిఎం కెసిఆర్ అన్నారు. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ, ‘మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని. మీ పరిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలి. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. ఎక్కడి ఇఎన్సిలు అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని,ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలని,ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఇఎన్సిని ఆదేశించారు. కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని,ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చిన నీటిని ఎత్తిపోస్తూ రాష్ట్రంలో తాగు,సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులపైన ఉన్నదని, ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు అని,ఇది ఇరిగేషన్ శాఖకు ‘టెస్టింగ్ టైం’ అని అన్నారు.
ప్రభుత్వ సంస్థలకు ‘పంపింగ్ నిర్వహణ’
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ జెన్ కో కు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్ కు నాగార్జున సాగర్ నుండి నీరు వచ్చే అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎగువ గోదావరి నుండి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీరు మేడిగడ్డ రిజర్వాయర్ కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని, ప్రతి రోజు 1 టిఎంసి నీటిని మేడిగడ్డ నుండి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ళకు ఎత్తిపోసేలా మోటార్లను 24 గంటలు నడిపిస్తూనే ఉండాలన్నారు. సుందిళ్ళ నుంచి అంతే నీటిని మిడ్ మానేరు తరలించాలని, అక్కడి నుండి సగం నీటిని లోయర్ మానేరుకు, సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్ఆర్ఎస్పికి తరలించాలని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుండి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి ఆయకట్టు చిన సీతారాం తండా వరకు సాగునీరు అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇరిగేషన్, విద్యుత్ శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు.
నీటిని జాగ్రత్తగా వినియోగించుకోండి
కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రజలు, రైతాంగం జాగ్రత్తలు వహిస్తూ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, అందుకు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులకు, ప్రజలకు సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు టి,హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయకార్ రావు, జి.జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జాజుల సురేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సిఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బి ఎండి దాన కిషోర్, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, ట్రాన్స్ కో అండ్ జెన్ కో సీఎండి ప్రభాకర్ రావు, టిఎస్ఎస్పిడిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి, టిఎస్ ఎన్సిపిడిసిఎల్ సిఎండి గోపాల్ రావు, ఎత్తి పోతల పథకాల సలహాదారు కె.పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.