ప్రజాపక్షం/పూడూరు : ప్రపంచ దేశాలు కంప్యూటర్ పాలన ద్వారా అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుంటే మన దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. 2009 నుండి 2013 జూలై వరకు ఐదు సంవత్సరాల కాలానికి గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే లక్ష్యంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ద్వారా ‘ఎడికామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా 2009లో మహబూబ్నగర్ జిల్లా పూడురు మండలంలోని ఐదు ఠశాలలను ఎంపిక చేసి ఆ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించెందుకు పాఠశాలకు ఒక ఉపాధ్యాయున్ని ఐదు సంవత్సరాలకు ఒప్పందంపై నెలకు రూ.2500 వేతనం చెల్లించేది. దాంతో నేటి టెక్నాలజీ యుగంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అభ్యసించే అవకాశం వచ్చిందని ఆనందపడ్డారు. ఐదేళ్లు సజావుగానే సాగిన కంప్యూటర్ విద్య తదనంతరం ఒప్పందం రెన్యూవల్ కాకపోవడం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కంప్యూటర్ విద్యన పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అభ్యసించే పరిస్థితి లేకుండా పోయింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విజ్ఞానం(కంప్యూటర్), కళలు, ఆటలు తదితర వాటిని పాఠశాలల్లో నేర్పించాల్సి ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు అందకుండా పోతున్నదని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు పట్టణ కళాశాలల్లో చదివితే తప్ప వారికి కంప్యూటర్ అంటే తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ఉన్న కంప్యూటర్లను పట్టించుకునే నాథుడు లేక అవి మూలన పడ్డాయి. డిజిటల్ లిటరసీ, డిజిటల్ విద్యావిధానం అంటూ గొప్పలు చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత విద్యను గాలికి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యాధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న కంప్యూటర్ విద్యను పున:ప్రారంభించాలని మండల పరిధిలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అటకెక్కిన కంప్యూటర్ విద్య..!
RELATED ARTICLES