HomeNewsBreaking Newsపోలింగ్‌కు బీహార్‌ సిద్ధం

పోలింగ్‌కు బీహార్‌ సిద్ధం

నేడు మొదటి అసెంబ్లీ ఎన్నికలు
1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్న రెండు కోట్లకుపైగా ఓటర్లు
పాట్నా : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు షురూ అయ్యాయి. మొత్తం మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వస్తుండగా, 71 నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికలు నేడు (ఈనెల 28న) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు కోట్లకుపైగా ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఎన్నికల ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. పోలింగ్‌ బూత్‌లలో ఓటువేసేందుకు గతంలో 1600 మందికి అనుమతి ఉండగా, ఇప్పటి ఆ సంఖ్యను కుదించింది. కేవలం 1000 మందికి మాత్రమే అవకాశం కల్పించింది. పోలింగ్‌ సమయాన్ని అస్థిరం చేస్తూ 80 ఏళ్లకు పైబడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ను సదుపాయాన్ని కల్పించింది. అదే విధంగా శానిజైట్‌ చేసిన ఇవిఎం మెషన్లుతో పాటు పోలింగ్‌ సిబ్బంది మాస్కులు ధరించడం, ఇతర రక్షణ చర్యలను చేపట్టాలను ఇసి తన మార్గదర్శకాల్లో పేర్కొంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద థర్మల్‌ స్కానర్‌, హ్యాండ్‌ శానిటైజర్‌, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచనున్నారు. కాగా, మొత్తం 2.14 కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అందులో 1.04 కోట్ల మంది మహిళలు ఉండగా, 599 మంది థర్డ్‌జండర్‌కు చెందిన వారు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌ సమకూర్చిన గణాంకాల ద్వారా వెల్లడయింది. బరిలో ఉన్న 1,066 మంది అభ్యర్థుల్లో 952 మంది పురుషులు కాగా, 114 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా గయా టౌన్‌ నియోజకవర్గం నుంచి 27 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, అత్యల్పంగా బాంక జిల్లా కటోరియాలో ఐదుగురు బరిలో నిలిచారు. మొత్తం 71 సీట్లకు జరుగుతున్న మొదటి విడుతల ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన జెడియు 35, దాని మిత్రపక్షమైన బిజెపి 29, ప్రతిపక్షమైన ఆర్‌జెడి 42 మంది, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌ 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) 41 సీట్లలో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే జెడియు పోటీ చేస్తున్న 35 స్థానాల్లోనూ ఎల్‌జెపి అభ్యర్థులను పోటీకి దింపింది. రాష్ట్రంలో ఇటీవలే ఎల్‌జెపి ఎన్‌డిఎను వైదొలగిన విషయం తెలిసిందే. బరిలో ఉన్న ప్రముఖ వ్యక్తులను పరిశీలిస్తే.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌మెడలిస్టు షూటర్‌ 27 ఏళ్ల శ్రేయాసి సింగ్‌ బిజెపి తరుపున జముయి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. చిరాగ్‌ పాశ్వాన్‌ జముయి లోక్‌సభ నుంచి బరిలో ఉన్నారు. శ్రేయాసీ సింగ్‌కు ప్రత్యర్థిగా ఆర్‌జెడికి చెందిన విజయ్‌ ప్రకాశ్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. కేంద్రమాజీ మంత్రి జయప్రకాశ్‌ నారాయణ్‌ యాదవ్‌ 28 ఏళ్ల కూతురు దివ్యా ప్రకాశ్‌ తారాపూర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, ఆరుగురు మంత్రిమండలి సభ్యులు ప్రేమ్‌కుమార్‌ (గయా టౌన్‌), విజయ్‌ కుమార్‌ సిన్హా (లాఖీసారయ్‌), రామ్‌ నారాయణ్‌ మండల్‌ (బాంక), కృష్ణనందన్‌ ప్రసాద్‌ వర్మ (జెహనాబాద్‌), జైకుమార్‌ సింగ్‌ (డినారా), సంతోష్‌ కుమార్‌ నిర్లా(రాజ్‌పూర్‌)లు మొదటి విడత ఎన్నికల్లో బరీలో ఉన్నారు. అయితే గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్‌లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుందని అంచనా. మాజీ ముఖ్యమంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జితన్‌ రామ్‌ మాంజీ ఎన్‌డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. అదే నియోజకవర్గంలో 2015 వరకు సేవలందించిన ఉదయ్‌ నారాయణ్‌ చౌదరిని ఆర్‌జెడి రంగంలోకి దింపింది. జెడియును వీడి కొన్నేళ్ల క్రితమే ఉదయ్‌ ఆర్‌జెడి తీర్థం పుచ్చుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments