సెంటు భూమిని కూడా వదులుకోం
6, 7 తేదీల్లో పోడు క్షేత్రాల సందర్శన
వామపక్షాల నేతల వెల్లడి
ప్రజాపక్షం/ కొత్తగూడెం పేద పోడు రైతాంగంపై ప్రభుత్వ దాడులు, నిర్బంధాలు, పంటల విధ్వంసాన్ని సంహించబోమని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సెంటు భూమిని కూడా లాక్కోనివ్వబోమని వామపక్ష పార్టీల జిల్లా నేతలు పునరుద్ఘాటించారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆవునూరి మధు, ఎల్.విశ్వనాథం, మాచర్ల సత్యం మాట్లాడుతూ అడవినే నమ్ముకొని కొన్నేళ్ల నుంచి జీవనం సాగిస్తున్న గిరిజనులు, గిరిజనేతర పేదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవనం లేకుండా చేస్తోందన్నారు. ప్రధానంగా జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలో లక్షలాది మంది పేదలు, గిరిజనులు ఆరు దశాబ్దాలకు పైగా పోడు సాగు చేసుకుంటున్నారని, ఈ భూములకు హక్కు పత్రాలు అందించడంలో పాలకులు విఫలం చెందారని విమర్శించారు. అనేక పోరాటాలతో సాధించుకున్న 2005 అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి తూట్లు పొడిచే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. పోడు సమస్యకు తానే స్వయంగా పరిష్కారం చూపుతానని, దళితులకు, పేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని స్వయంగా ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ హామీని అమలు చేయకపోగా హరితహారం పేరుతో అనాదిగా సాగుచేసుకుంటున్న భూములను లాక్కుని ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు. యంత్రాలతో పంటలను ధ్వంసం చేస్తూ, కందకాలు తవ్వుతూ ఏజెన్సీ ప్రజలను భయబ్రాంతుకలు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పేదలపై ఫారెస్టు, పోలీసు, రెవెన్యూ శాఖలను ఉసిగొల్పుతున్న ప్రభుత్వంపై పోడు రైతులు తిరగబడాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సహనాన్ని పరీక్షిస్తోందని, తీరు మార్చుకోని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, పోడు క్షేత్రాల నుంచి ఫారెస్టు, పోలీసులను వెనక్కు పంపకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోడు సమస్య పరిష్కారం కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో 6, 7 లేదీల్లో పోడు క్షేత్రాల సందర్శన, 8వ తేదీన 2వేల మంది పోడు ప్రతినిధులతో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు సిపిఎం నాయకులు , న్యూడెమోక్రసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోడు రైతులపై దాడులు, నిర్బంధాలను సహించం
RELATED ARTICLES