HomeNewsBreaking Newsన్యూజిలాండ్‌ 178 ఆలౌట్‌

న్యూజిలాండ్‌ 178 ఆలౌట్‌

శ్రీలంకతో రెండో టెస్టు
ఒవాల్‌: శ్రీలంక, న్యూజిలాండ్‌ మధ్య ప్రారంభమైన రెండో టెస్టులో లంక బౌలర్‌ సురంగా లక్మాల్‌ 5 వికెట్లతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన శ్రీలంక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు లంక 90 పరుగుల దూరంలో నిలిచింది. బౌలర్ల హవా కొనసాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను లంక బౌలర్‌ సురంగా లక్మాల్‌ ఆదిలోనే ఎదురుదెబ్చేశాడు. జట్టు స్కోరు 16 పరుగుల వద్దే ఓపెనర్‌ జీత్‌ రావల్‌ (6)ను సురంగా లక్మాల్‌ బోల్తా కొట్టించాడు. తర్వాత ఒక్క పరుగు వ్యవధిలోనే కుదురుగా ఆడుతున్న మరో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (30 బంతుల్లో 10) పరుగులను ఔట్‌ చేసి కివీస్‌కు రెండో షాకిచ్చాడు. తర్వాత కివీస్‌ కెప్టెన్‌ కెన్‌ విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మరో ఐదు పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్‌ సారథి విలియమ్సన్‌ (2) పరుగుల వద్ద లక్మాల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో కివీస్‌ జట్టు 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెన్రీ నికొలాస్‌ (1)ను కూడా లక్మాల్‌ క్లీన్‌ బౌల్డ్‌గా పెవిలియన్‌ పంపి న్యూజిలాండ్‌కు కోలుకోలేని దెబ్బేశాడు. లక్మాల్‌ నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఇతని ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. రెండంకెల స్కోరును కూడా చేయడం వారికి కష్టంగా మారింది. లక్మాల్‌ ధాటికి కివీస్‌ జట్టు 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు రాస్‌ టేలర్‌ మాత్రం నిలకడగా ఆడుతూ పోయాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ 50 పరుగుల మార్కును దాటింది. ఆ కొద్ది సేపటికే కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న రాస్‌ టేలర్‌ (27; 46 బంతుల్లో 4 ఫోర్లు) రన్నౌట్‌గా వెనుదిరిగడంతో కివీస్‌ మరింతగా కష్టాల్లో కూరుకపోయింది. తర్వాత వచ్చిన కోలిన్‌ గ్రాండ్‌హూమ్‌ (1)ను లామిరు కుమార పెవిలియన్‌కు పంపి 64 పరుగుల వద్ద కివీస్‌ ఆరో వికెట్‌ పడగొట్టాడు.
ఆదుకున్న టిమ్‌ సౌథీ, వాట్లింగ్‌
ఈ సమయంలో వాట్లింగ్‌, టిమ్‌ సౌథీ అసాధారణ బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఒకవైపు తమ వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. వాట్లింగ్‌ కుదురుగా ఆడుతుంటే సౌథీ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. వరుస బౌండరీలతో లంక బౌలర్లపై విరుచుకపడ్డాడు. చివరికి వీరిద్దరూ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో ఏడో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. దీంతో కివీస్‌ ఆ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన వాట్లింగ్‌ 90 బంతుల్లో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్‌ 172 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. తర్వాత మూడు పరుగుల వ్యవధిలోనే మరో కీలక బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సౌథీ (68; 65 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు)ను దిల్రువా పెరీరా పెవిలియన్‌ పంపాడు. తర్వాత పుంజుకున్న లంక బౌలర్లు 50 ఓవర్లలో 178 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను ముగించారు. లంక బౌలర్లలో కెరీర్‌ బెస్ట్‌ గణంకాలను నమోదు చేసిన సురంగా లక్మాల్‌ (5/54) వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమార మూడు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు కూడా ఆరంభంలోనే షాక్‌ తగిలింది. బ్యాటింగ్‌లో చెలరేగిన సౌథీ బాల్‌తో కూడా విధ్వంసం సృ లంక బ్యాట్స్‌మెన్స్‌పై ఎదురుదాడికి దిగి వరుసక్రమంలో వికెట్లు తీస్తూ హడలెత్తించాడు. సౌథీ ధాటికి ధనుష గుణరత్నే (8), దిముత్‌ కరుణరత్నే (7), లంక కెప్టెన్‌ డినేశ్‌ చండీమల్‌ (6) పరుగులు మాత్రమే చేసి ఇంటి ముఖం పట్టారు. దీంతో లంక 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత కుశాల్‌ మెండీస్‌ (32 బంతుల్లో 15) పర్వాలేదనిపించినా భారీ స్కోరు చేయలేక పోయాడు. గ్రాండ్‌హూమ్‌ బౌలింగ్‌లో ఇతను నాలుగో వికెట్‌ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన అంజెలో మాథ్యూస్‌ (27 బ్యాటింగ్‌), రోషన్‌ సిల్వా (15 బ్యాటింగ్‌) తమ జట్టును ఆదుకోవడంతో బుధవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి లంక 88/4 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చేసిన సౌథీ 29 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments