దేశంలో కొత్తగా 55,839 మందికి పాజిటివ్
77 లక్షలు దాటిన కరోనా బాధితులు
1,16,616కు చేరిన మృతులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం 50 వేలలోపు కొత్త కేసులు నమోదు కాగా, మళ్లీ కాస్త పెరిగాయి. అయితే వరుసగా మూడవ రోజు కూడా 60 వేల లోపు మందికి వైరస్ సోకింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 77 లక్షలు దాటింది. అదే విధంగా గత రెండు రోజుల క్రితం మరణాల సంఖ్య 600కు దిగువకు నమోదు కాగా ప్రస్తుతం 700కుపైగా సంభవిస్తున్నాయి. రికవరీల సంఖ్య 68 లక్ష లు దాటింది. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,839 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 77,06,946కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 702 మంది కరోనా కారణంగా ప్రాణా లు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,16,616కి పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 1.51 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70 శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తుంది. గత 24 గంటల్లో మరో 79,415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కొత్త రికవరీ అయిన వారు దాదాపు 24 వేల మంది అధికంగా ఉన్నారు. కొత్త రికవరీలతో కలిపి గురువారం ఉదయం నాటికి 68,74,518 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 89.20 శాతానికి ఎగబాకింది. ఇక నిత్యం యాక్టివ్ కేసుల సంఖ్య పడిపోతుంది. గత ఆరు రోజుల నుంచి 8 లక్షల దిగువకు రికార్డు అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 7,15,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో ఈ సంఖ్య 9.29 శాతం మాత్రమేనని మంత్రిత్వశాఖ పేర్కొంది. భారత్లో ఆగస్టు 7న కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకోగా, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలు, సెప్టెంబర్ 28న ఆ సంఖ్య 60 లక్షలు దాటింది. అక్టోబర్ 11 నాటికి ఆ సంఖ్య 70 లక్షలు దాటింది. అయితే దేశంలో లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా, అవి 59 రోజుల్లో 10 లక్షలకు చేరాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండవ స్థానంలో, బ్రెజిల్ మూడవ స్థానంలో ఉంది. మృతుల సంఖ్యలో మాత్రం భారత్ మూడవ స్థానంలో కొనసాగుతుంది. రోజువారీ రికవరీల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 9,86,70,363 శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది. బుధవారం 14,69,984 పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కొత్తగా 702 మరణాలు చోటు చేసుకోగా, మహారాష్ట్రలో 24 గంటల్లో 180 మంది మృతి చెందారు. కర్నాటకలో 88, తమిళనాడులో 39, పశ్చిమ బెంగాల్లో 64, ఛత్తీస్గఢ్లో 44, ఉత్తరప్రదేశ్లో 41 మంది, ఢిల్లీలో 47 మంది మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు 1,16,616 మంది బలి కాగా, ఒక్క మహారాష్ట్రలోనే 42,633 మంది మృత్యువాత పడ్డారు. అదే విధంగా తమిళనాడులో 10,780, కర్నాటకలో 10,696, ఉత్తరప్రదేశ్లో 6,755, ఆంధ్రప్రదేశ్లో 6,508, పశ్చిమ బెంగాల్లో 6,244, ఢిల్లీలో 6,128, పంజాబ్లో 4,060, గుజరాత్లో 3,660 మంది కొవిడ్ కారణంగా మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా వెల్లడయింది. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఒక్క రోజు వ్యవధిలో 8,142 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. తాజాగా మహారాష్ట్ర కంటే అధికంగా 8,369 మందికి వైరస్ బారిన పడగా, కర్నాటకలో 5,872 మందికి పాజిటివ్ వచ్చింది.
దేశంలో 77.6 లక్షలు కేసులు
RELATED ARTICLES