HomeNewsBreaking Newsదండుయాత్రకు దీటుగా..!

దండుయాత్రకు దీటుగా..!

మిడతల దాడులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు
ఫైర్‌ ఇంజన్లను, జెట్టింగ్‌ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధం
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : మిడతల దండు తెలంగాణ రాష్ర్టంలోకి దూసుకురాకుండా అన్నిరకాల ముందు జాగ్రత్త చర్య లు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు. మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్ట సరిహద్దుల్లో గల జిల్లాల కలెక్టర్లను, పోలీ సు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్‌ ఇంజన్లను, జెట్టింగ్‌ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధం గా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి తెలంగాణ రాష్ర్టంలో ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు తెలిపారు. మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్దన్‌ రెడ్డి, ఎస్‌.నర్సింగ్‌ రావు, జయేశ్‌ రంజన్‌, పిసిసిఎఫ్‌ శోభ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఫైర్‌ డిజి సంజయ్‌ కుమార్‌ జైన్‌, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్‌ రావు, సిఐపిఎం ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌. జె. రహమాన్‌ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాబోయే రోజుల్లో మిడతలు ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని సిఎం కెసిఆర్‌ ఆరా తీశారు. రాజస్థాన్‌ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ర్టలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్‌ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేళ గాలి దక్షిణం వైపు మళ్లితే ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని తేల్చారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ తెలంగాణ రాష్ర్టంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. “ప్రస్తుతం మహారాష్ర్ట, మధ్యప్రదేశ్‌ సరిహద్దుల్లో గల మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారు. అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్‌ మీదుగా పంజాబ్‌ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. గాలి మరలి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చు. అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
మిడతల దండు విషయంలో ప్రభుత్వ చర్యలు-
-మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. సిఐపిఎం ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌. జె. రహమాన్‌, వరంగల్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ అక్బర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్‌ భారతితో కమిటీని నియమించింది. ఈ కమిటీ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్‌ ద్వారా ఆదిలాబాద్‌ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. మిడతల దండు సమీపంలోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు.
* భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి.
* మహారాష్ర్ట, చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్‌, క్లోరోఫైరిపాస్‌, లామ్డా సైలోత్రిన్‌ ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలి.
* 12 ఫైర్‌ ఇంజన్లు, 12 జెట్టింగ్‌ మిషన్లు సిద్ధంగా పెట్టుకోవాలి.
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్‌ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్‌, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలి.
సమీక్షా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌, విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్థన్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జీవన్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments