ప్రజాపక్షం/హైదరాబాద్ : విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చింతకింద కాశీం అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖ లు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలోని ములుగు పోలీసు స్టేషన్లో 2016లో నమోదైన కేసులో పోలీసులు కాశీంను అరెస్టు చేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం హాజరుపరిచారు. కాశీంకు మావోయిస్టు అగ్ర నేతలతో సంబంధాలు కొనసాగుతున్నాయని పోలీసులు ఆరోపించారు. విచారణ నిమిత్తం ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించా రు. హైకోర్టు ఆదేశాల మేరకు కాశీంను సం గారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాశీం అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. అనంతరం ఈ పిటిషన్పై ఆయన నివాసంలోనే విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారు. విచారణ అంతరం న్యాయవాది మాట్లాడుతూ ‘ప్రొఫెసర్ కాశీం అరెస్టుపై హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాం. కోర్టు ఆదేశాల మేరకు చీఫ్ జస్టిస్ ముందు హాజరు పరిచారు. కాశీం ఇంటిపై సోదాలు చేసి అరెస్టు చేసిన విధానంపై వాదనలు వినిపించాము. 2016లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులపై అక్రమ అరెస్టులకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాము’ అని తెలిపారు. ఇక కాశీం కుటుంబ సభ్యులను కలవడానికి మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. దీంతో అతని కుటుంబ సభ్యులు కాశీంను కలిసి మాట్లాడారు.
చర్లపల్లి జైలుకు కాశీం
RELATED ARTICLES