న్యూఢిల్లీ: క్రమం తప్పకుండా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలకు కళ్లెం ఎప్పుడు పడుతుందనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాన్యుడిని వేధిస్తున్న ప్రశ్న. తాజా పెంపుతో 14.2 కేజీల సిలిండర్ ధర ఏకంగా 1,105 రూపాయలకు చేరి, సగటు జీవిని ఆందోళనకు గురి చేస్తున్నది. ఎనిమిదేళ్ల క్రితం, బిజెపి సర్కారు మొదటిసారి అధికారంలో వచ్చినప్పటి ధరతో పోలిస్తే, గ్యాస్ సిలిండర్ ధర 169.51 శాతం పెరిగింది. ఇదే కాలంలో ఆదాయం ఆ స్థాయిలో పెరగలేదన్నది నిజం. పైగా, కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గింది. ఉపాధి అవకాశాలు
అటకెక్కాయి. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి తాకుతుండగా, మరోవైపు గ్యాస్ ధరలు కూడా పోటీపడి పెరగడం మధ్య, దిగువ మధ్య, పేద వర్గాలను అల్లాడిస్తున్నది. పెట్రోలు, డీజల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా, రవాణా వాహనాలకు భారమై సరుకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. నిత్యావసర సరు కుల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లోనే గ్యాస్ ధర పెంచడం మూలిగే నక్కమీద తాటికాయ పడడమే. దేశవ్యాప్తంగా గురువారం నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన గ్యాస్ధర అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నది. భవిష్యత్తు మరింత భయానకంగా ఉంటుందనే భయాన్ని కలిగిస్తున్నది. నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల ఆదాయం ఎంత? చాలీచాలని ఆదాయంతో బడకం ఎలా? బియ్యం ధరలు పెరిగాయి. ఉప్పులు పప్పులు, అల్లం బెల్లం, కూరగాయలు.. ఇలా అన్ని వస్తువుల రేట్లు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ను, రష్యా యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం ప్రత్యక్షంగా చమురు కంపెనీలకు, పరోక్షంగా కేంద్రానికి అలవాటైంది. ఎవరు ఎన్ని కారణాలు చూపినా, ఎంతగా తమ వాదనను బలపరచుకునేందుకు ప్రయత్నించినా, నష్టపోతున్నది.. కష్టపడుతున్నది మాత్రం సామాన్యుడే. ఈ బాదుడుకు విరామం ఎప్పుడో? ప్రజలకు ఊరట ఎన్నడో?
గ్యాస్ ధరలకు కళ్లెం ఎప్పుడు?
RELATED ARTICLES