HomeNewsBreaking News‘గోదావరి’ తెస్తేనేకామారెడ్డిలో అడుగిడాలి

‘గోదావరి’ తెస్తేనేకామారెడ్డిలో అడుగిడాలి

కాంగ్రెస్‌ సాగునీటి ప్రాజెక్టులు కడితే కాళేశ్వరం పేరుతో కెసిఆర్‌ లక్షకోట్లు మింగేశారు
కాంగ్రెస్‌ ఏంచేసిందో నాగార్జునసాగర్‌ కట్టమీద చర్చిద్దామా అని బిఆర్‌ఎస్‌ నాయకులకు టిపిసిసి చీఫ్‌ సవాల్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌
“కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కడితే..కెసిఆర్‌ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్‌ కామారెడ్డిలో అడుగుపెట్టాలి” అని టిపిసిసి అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందో..నాగార్జున సాగర్‌ కట్టమీద చర్చిద్దామా? అని బీఆర్‌ఎస్‌ నాయకులకు టిపిసిసి సవాలు విసిరారు. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్‌ ఏం చేసిందో తెలుస్తుంది అని అన్నారు. మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్‌, తన అనుచరులతో కలిసి గాంధీ భవన్‌ లో రేవంత్‌ రెడ్డి, ఎఐసిసి ఇంచార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ రెడ్డి, మాణిక్‌ రావ్‌ ఠాక్రే పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రశేఖర్‌ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని, వారికి కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో
తెలంగాణ బొందలగడ్డగా మారింది అని విమర్శించారు. “దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అంటున్నారు. అవును.. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ర్టంలో లేవు” అని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. వైన్‌ షాపుల టెండర్ల పేరుతో రూ. 2500 కోట్లు కేసీఆర్‌ కొల్లగొట్టారన్నారు. కాంగ్రెస్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తే… కేసీఆర్‌ 7500 కోట్లకు తెగమ్ముకున్నారు అని విమర్శించారు.
“కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం. కెసిఆర్‌కు సూటిగా సవాల్‌ విసురుతున్న ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు…డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడగం” అని బిఆర్‌ఎస్‌ నాయకులకు రేవంత్‌ రెడ్డి సవాలు విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కెసిఆర్‌ తుంగలో తొక్కారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మూడు పార్టీలను ఓడించండి. కాంగ్రెస్‌ను గెలిపించండి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తాం.26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలి” అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదుః
బిజెపితో బిఆర్‌ఎస్‌ పొత్తు ఖాయమైంది కాబట్టే, కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని కెసిఆర్‌ వదిలేసారని రేవంత్‌ రెడ్డి కెసిఆర్‌ ను విమర్శించారు. మునుగోడు లో కమ్యూనిస్టులతో కలిసిన కేసీఆర్‌…కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాష్ర్టంలో బీజేపీకి, కాంగ్రెస్‌ కు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్‌.. అమిత్‌ షాతో చీకట్లో ఒప్పందం చేసుకొని.. రాష్ర్టంలో కమ్యూనిస్టులకు పంగనామాలు పెట్టాడు అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు లకు సీట్లు ఇవ్వకుండా, ఏకపక్షంగా కేసీఆర్‌ ఎందుకు సీట్లు ప్రకటించారు..? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.
చేవెళ్ల సభ ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 26న చేవెళ్లలో జరిగే ప్రజాగర్జన సభ ఏర్పాట్లను రేవంత్‌ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏర్పాట్లపై పార్టీ నాయకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజా గర్జన సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు పిలుపునిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments