HomeNewsBreaking Newsకివీస్‌దే పైచేయి!

కివీస్‌దే పైచేయి!

తొలి ఇన్నింగ్స్‌ 51 పరుగుల ఆదిక్యంలో న్యూజిలాండ్‌
165 పరుగులకే కుప్పకూలిన భారత్‌
తొలి టెస్టు.. రెండోరోజు
వెల్లింగ్టన్‌: వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌పై ఆతిధ్య న్యూజిలాండ్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే భారత్‌ను ఆలౌట్‌ చేసిన కివీస్‌.. ప్రస్తుతం 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (89, 153 బంతుల్లో; 11×4) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న సీనియర్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ (44, 71 బంతుల్లో; 6×4, 1×6) ఆకట్టుకున్నాడు. మొదటగా కివీస్‌ బౌలర్లు చెలరేగితే.. ఆపై బ్యాట్స్‌మన్‌లు రాణించారు. శనివారం భారత్‌ ఆలౌట్‌ అనంతరం కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (11)ను ఆదిలోనే ఇషాంత్‌ శర్మ ఔట్‌ చేసి షాక్‌ ఇచ్చాడు. అయితే మరో ఓపెనర్‌ టామ్‌ బ్లండెల్‌ (30)తో కలిసి కేన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంది. అయితే ఇషాంత్‌ బ్లండెల్‌ను క్లీన్‌బౌల్‌ చేసి 46 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరదించాడు.
చెలరేగిన విలియమ్సన్‌..
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాస్‌ టేలర్‌ కలిసి విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను చీల్చి చెండాడారు. పచ్చిక పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేస్తే.. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు మాత్రం అద్భుతం అనిపించారు. ఇషాంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ షమీ, ఆర్‌ అశ్విన్‌లను ధీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసాడు. ఈ సమయంలో ఇషాంత్‌ కివీస్‌ను మరోసారి దెబ్బ కొట్టాడు. సిరీస్‌ ఆసాంతం ఫామ్‌లో ఉన్న టేలర్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌ వేసి టేసి బోల్తా కొట్టించాడు. దీంతో కేన్‌-టేలర్‌ 93 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత విలియమ్సన్‌ కొద్దిసేపు పరుగులు చేసాడు. విలియమ్సన్‌ను షమీ, హెన్రి నికోల్స్‌ను (17) అశ్విన్‌ ఔట్‌ చేసారు. దీంతో కివీస్‌ 5 వికెట్లు కోల్పోయింది. వాట్లింగ్‌ (14, 29 బంతుల్లో; 1స4), గ్రాండ్‌హోమ్‌ (4, 2 బంతుల్లో; 1స4) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
భారత్‌ 165.. ఆలౌట్‌
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 122/5తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్‌ అయింది. మరో 43 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ఆరంభించిన కొద్దిసేపటికే భారత్‌కు షాక్‌ తగిలింది. అజింక్య రహానె (46)తో సమన్వయం లోపించడంతో రిషబ్‌ పంత్‌ (19) రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ సౌథీ వేసిన తొలి బంతికే బౌల్డయ్యాడు. అనంతరం రహానె, ఇషాంత్‌ శర్మ (5) కూడా పెవిలియన్‌ బాట పట్టారు. చివర్లో షమీ (20) బ్యాటు ఝుళిపించడంతో భారత్‌ 165 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌ (4/39), టిమ్‌ సౌథీ (4/49) రాణించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments