రికార్డుస్థాయిలో 12,881 కేసులు
భారత్లో 24 గంటల్లో 334 మంది మత్యువాత
3,66,946కు చేరిన పాజిటివ్ కేసులు
12,237కు పెరిగిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ : భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఏడవ రోజు కూడా 10 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. 24 గంట ల్లో కొత్తగా 12,881 మంది కొవిడ్ బారిన పడ్డారు. దేశంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇంత గరిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి భారత్లో ఇప్పటి వరకు మొత్తం 3,66,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జూన్ 1 నుంచి 18వ తేదీ వరకు 1,76,411 మందికి కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. బాధితల సంఖ్య పెరుగుతున్న టాప్ పది రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. అటు మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. నిత్యం 300లకు పైగా మంది మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఉద యం నుంచి గురువారం ఉదయం వరకు కొత్త గా 334 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12,237కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. గత రెండు రోజుల్లో భారత్లో మరణాల రేటు 2.8 శాతం నుంచి 3.3 శాతానికి పెరిగింది. కాగా, గురువారం ఉదయం నాటికి దేశంలో 1,60,384 యాక్టివ్ కేసులు ఉండగా, 1,94,324 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 52.95గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్, భారత్లలోనే నిత్యం పదివేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం నుంచి మహారాష్ట్రలో 114 మంది, ఢిల్లీలో 67 మంది, తమిళనాడులో 48 మంది, గుజరాత్లో 27, ఉత్తరప్రదేశ్లో 18, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్లో 11 మంది, కర్నాటకలో 8 మంది, పంజాబ్, మధ్యప్రదేశ్లో ఆరుగురు చొప్పున, రాజస్థాన్లో ఐదుగురు, బీహార్లో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్లో ఇద్దరు చొప్పున, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు సంభవించిన మొత్తం 12,237 మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 5,651 మంది కరోనా వైరస్కు బలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,904 మంది, గుజరాత్లో 1,560 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్యలో ఈ మూడూ రాష్ట్రాల్లో అధికంగా ఉండడం కలవర పెడుతోంది. కాగా, తమిళనాడులో కరోనా కాటుకు 576 మంది, పశ్చిమ బెంగాల్లో 506, మధ్యప్రదేశ్లో 482, ఉత్తరప్రదేశ్లో 435, రాజస్థాన్లో 313, తెలంగాణలో 192, హర్యానాలో 130, కర్నాటకలో 102, ఆంధ్రప్రదేశ్లో 90, పంజాబ్లో 78, జమ్మూకశ్మీర్లో 65, బీహార్లో 44 మంది, ఉత్తరాఖండ్లో 26 మంది, కేరళలో 20 మంది, ఒడిశాలో 11 మంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో 10 మంది చొప్పున, అసోం, హిమాచల్లో 8 మంది చొప్పున, పుదుచ్చేరిలో ఏడుగురు, చండీగఢ్లో ఆరుగురు, మేఘాలయ, త్రిపుర, లడఖ్లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 1,16,752 కేసులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో కొనసాగుతుంది. తమిళనాడులో 50,193 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 47,102, గుజరాత్లో 25,093, ఉత్తరప్రదేశ్లో 14,598, రాజస్థాన్లో 13,542, పశ్చిమ బెంగాల్లో 12,300, మధ్యప్రదేశ్లో 11,244, హర్యానాలో 8,832, కర్నాటకలో 7,734, ఆంధ్రప్రదేశ్లో 7,071, బీహార్లో 6,942, తెలంగాణలో 5,675, జమ్మూకశ్మీర్లో 5,406, అసోంలో 4,605, ఒడిశాలో 4,338, పంజాబ్లో 3,497, కేరళలో 2,697, ఉత్తరాఖండ్లో 2,023, జార్ఖండ్లో 1,895, ఛత్తీస్గఢ్లో 1,864, త్రిపురలో 1,135, లడఖ్లో 687, గోవాలో 656 మంది, హిమాచల్లో 569 మంది, మణిపూర్లో 552 మందికి కరోనా సోకింది. అదే విధంగా చండీగఢ్లో 368, పుదుచ్చేరిలో 245, నాగాలాండ్లో 193 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక మిజోరాంలో 121, అరుణాచల్లో 99, సిక్కింలో 70, దాదర్ నగర్ హవేలీ, దామన్ డియోలో 57 చొప్పున, మేఘాలయ, అండమాన్ నికోబార్లో 44 కేసులు నమోదయ్యాయి. మరో 8,703 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఒక్కరోజే 352 కేసులు
6,000 దాటిన కొవిడ్ 19 పాజిటివ్లు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసులు మరింత పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలు జరిపేకొద్దీ కేసులు బయటపడుతున్నాయి. తొలిసారిగా ఒక్కరోజే గురువారంనాడు ఏకంగా 352 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్తగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 195కి చేరిం ది. రాష్ట్రంలో కేసుల సంఖ్య ఆరువేల మార్కు దాటింది. గురువారం నమోదైన 352 కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలోనే 302 పాజిటివ్లను గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ కాకుండా దాన్ని ఆనుకొని వున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 17, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొత్తగా 10 కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో మరింత అప్రమత్తం కావాల్సివుంది. ఇక మంచిర్యాల జిల్లాలో 4, వరంగల్ అర్బన్ జిల్లా, జనగామ జిల్లాల్లో మూ డేసి కేసులు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలే దు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,027కి పెరిగిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 2532 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 3301 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. గురువారంనాడొక్కరోజే 230 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది.