HomeNewsBreaking Newsకరోనాకు సూదిమందు

కరోనాకు సూదిమందు

‘కోవిఫర్‌’ పేరుతో త్వరలోనే మార్కెట్లోకి!
లక్ష డోసులు సిద్ధం చేసిన హెటిరో సంస్థ
హైదరాబాద్‌/ న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఔషధాన్ని తయారుచేసినట్లు భారత్‌కు చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ ప్రకటించి 24 గంటలు గడవకముందే హెటిరో సంస్థ కూడా సూదిమందును విడుదల చేస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేసింది. దీనికి డిసిజిఐ అనుమతి కూడా లభించడం విశేషం. ఒకటి రెండు వారాల్లో ఇది పూర్తిగా మార్కెట్‌లో అందుబాటులో వుండబోతున్నది. హైదరాబాద్‌ నగరంలోని సుప్రసిద్ధ జెనెరిక్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ హెటిరో సంస్థ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్‌ ఔషధాన్ని ‘కోవిఫర్‌’ ఇంజెక్షన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నది. కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్‌ యాంటీ వైరల్‌ మెడిసిన్‌ (రెమ్డిసివిర్‌) ఉత్ప త్తి, మార్కెటింగ్‌ కోసం డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) అనుమతి పొందినట్లు వెల్లడించింది. రెమ్డిసివిర్‌ హెటిరో జెనిరిక్‌ వెర్షన్‌కు ‘కోవిఫర్‌’ అనే పేరుతో భారతదేశంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ ఇంజెక్షన్లను లక్షడోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అయితే పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఒకటిరెండు వారాలు పట్టవచ్చు. డిసిజిఐచే అనుమతి పొందిన రెమ్డిసివిర్‌ ఔషధాన్ని కొవిడ్‌ అనుమానితులు లేదా ల్యాబ్‌లలో పరీక్ష చేసిన అనంతరం పాజిటివ్‌ రోగులుగా గుర్తించబడిన చిన్నారులు, యువత, కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రి పాలైన వారి చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిఫర్‌ (రెమ్డిసివిర్‌) 100 మిల్లీగ్రాములు ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యల పర్యవేక్షణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించవచ్చు. తక్కువ మధ్య స్థాయి ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలకు కోవిడ్‌-19 చికిత్స చేయడంలో భాగంగా గిలిడ్‌ సైన్సెస్‌ ఐఎన్‌సితో కుదుర్చుకున్న లైసెన్స్‌ ఒప్పందాన్ని అనుసరించి ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ‘భారతదేశంలో కోవిడ్‌-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణంలో ౠకోవిఫర్‌ౠ (రెమ్డిసివిర్‌) విజయవంతమైన క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొని అందుబాటులోకి రావడం గేమ్‌ చేంజర్‌గా మారనుంది. బలమైన ఇంటిగ్రేషన్‌ సామర్థ్యాలను కలిగి ఉండటం వల్ల ఈ ఉత్పత్తి దేశవ్యాప్తంగా వెంటనే రోగులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నెలకొన్న అవసరాలకు తగిన రీతిలో రోగులకు తగినట్లుగా ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమవుతోంది. కోవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య విభాగాలతో మేం నిరంతరం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపొందించిన ౠమేక్‌ ఇన్‌ ఇండియాౠ ప్రచారానికి తగినట్లుగా భారతదేశంలో ఈ ఉత్పత్తిని తీర్చిదిద్దాం’ అని ప్రకటించారు.
ఫవిపిరవర్‌కు డిసిజిఐ ఆమోదం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు చెందినప్రకటిం చింది. యాంటీ వైరల్‌ ఔషధం ‘ఫవిపిరవర్‌’ కోవిడ్‌ చికిత్సకు బాగా పనిచేస్తోందని, దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్‌ నేమ్‌తో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ తెలిపింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ) ఆమోదించినట్టు ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ ఇదివరకే వెల్లడించింది. తాము చేసిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫవిపిరవర్‌ మందు రోగులపై బాగా పనిచేస్తోందని కంపెనీ చైర్మన్‌, ఎండీ గ్లెన్‌ సల్దాన్హా తెలిపారు. ఫాబీఫ్లూ టాబ్లెట్‌ 200ఎంజీ ఒక్కోటి రూ.103కి మార్కెట్‌లో లభిస్తుందన్నారు. 34 టాబ్లెట్లు ఉన్న స్ట్రిప్‌ రూ.3,500లకు మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. మొత్తం 14 రోజులు ఈ మందుని రోగులు వాడాల్సి ఉంటుంది. మొదటి రోజు 1800ఎంజీ పరిణామం కలిగిన ఫాబిఫ్లూని రెండుసార్లు, ఆ తర్వాత నుంచి 14 రోజుల వరకు రోజుకి 800ఎంజీ రోగులు తీసుకోవాలి. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ద్వారానే ఈ ఔషధాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతానికి మొదటి నెలలో 82,500 మంది రోగులకి సరిపడా ఫాబిఫ్లూ టాబ్లెట్ల తయారీకి సన్నద్ధంగా ఉన్నామని, దేశంలో వైరస్‌ పరిస్థితిని బట్టి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళతామని సల్దాన్హా అన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చునని గ్లెన్‌మార్క్‌ తెలిపింది.
చైనా వ్యాక్సిన్‌ టెస్టులు పూర్తి
బీజింగ్‌ : కరోనా కట్టడికి చైనాలో వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా పరిశోధకులు తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు సంబంధించి మానవులపై పరీక్షల రెండో దశను ప్రారంభించారు. వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతను పరిశీలించేందుకు రెండో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌లో కీలక పరీక్షలు చేపడతామని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ బయాలజీ(ఐఎంబిసిఎఎంఎస్‌) ఆదివారం వెల్లడించింది. ఈ పరీక్షలో వ్యాక్సిన్‌ ఆరోగ్యవంతుల్లో వ్యాధి నిరోధక వ్యవస్ధను ఎంతవరకూ ప్రేరేపిస్తోంది, ఎంత డోస్‌ ఇవ్వాలనే దానిపై పరిశోధకులు ఓ అంచనాకు రానున్నారు. చైనాలో వ్యాక్సిన్‌ సరఫరాలను పూర్తిస్ధాయిలో చేపట్టేందుకు ప్రత్యేక ప్లాంట్‌లో వ్యాక్సిన్ల తయారీ చేపడతామని ఐఎంబిసిఎఎంఎస్‌ వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments