అందుకు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవాలని మంత్రి హరీశ్రావు సవాల్
ప్రజాపక్షం/హైదరాబాద్ పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎలా ఉందో, గత తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కరంటు ఎలా ఇచ్చామో వచ్చే ఎన్నికలలో ప్రజలను రెఫరెండం కోరదామని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు సవాలు విసిరారు. మూడు గంటల కరెంటు చాలు అని, ఎనిమిది గంటలు చాలని కాంగ్రెస్ అంటున్నారని, 24 గంటల ఉచిత విద్యుత్ మా నినాదమనే బిఆర్ఎస్ అంటున్నామని, దీనిపైనే రిఫరెండం అడుదామన్నారు. విద్యుత్ పై సిఎం కెసిఆర్ను ప్రశ్నించడం అంటే సూర్యుడి మీద ఉమ్మేయడమేనని అన్నారు. 24 గంటల కరెంటు వస్తలేదని లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, దానికి లాగ్ బుక్లు చూడడమెందుకు కరెంటు తీగలను పట్టుకోవాలని, లేదా కరెంటు పొక్కల్లో వేలు పెట్టి చూడాలని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రైతు బంధు చైర్మన్ డాక్టర్ పలా రాజేశ్వర్ రెడ్డి, కొడంగల్ ఎంఎల్ఎ పట్నం నరేందర్ రెడ్డిలతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారని ఆయన అనానరు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ర్టంలో చిన్న, సన్నకారు రైతులు 90 శాతం మంది
ఉన్నారని, రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని పిసిసి అధ్యక్షుడు అన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బోరు బావుల వద్ద మీటర్లు పెడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారని, సోనియాగాంధీ ఉచిత కరెంటు కు వ్యతిరేకం అని మరో అధికార ప్రతినిధి కాల్వ సుజాత అన్నారని హరీశ్రావు చెప్పారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ర్టంతెలంగాణ అని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం నాలుగు,ఐదు గంటలు మాత్రమే కరెంటు వచ్చేదన్నారు. రైతులకు ఏడు గంటల కరెంటు ఇవ్వలేమని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని ఆరోపించారు.
కాల్పులకు కెసిఆర్ కారణం అనడం పెద్ద జోక్ : బషీర్ బాగ్ కాల్పులకు కెసిఆర్ కారణం అనడం పెద్ద జోక్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే కరెంటు నుండి అని, నాడు పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని డిప్యూటి స్పీకర్ గా ఉన్న కెసిఆర్ కాల్పులు జరిగిన రోజే చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారని గుర్తు చేశారు.నాడు తెలంగాణరైతులకు అన్యాయం జరుగుతుందని మొదట స్పందించింది కెసిఆర్ అని, గడ్డిపోచల్లాగా పదవులు వదులుకున్న నాయకుడు ఆయన అన్నారు. మీరు పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విధానం మూడు గంటలు , కెసిఆర్ నినాదం మూడు పంటలు, బిజెపి నినాదం మతం పేరిట మంటలు అని అన్నారు.
ఎవరు కావాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు.
కాంగ్రెస్ రాష్ట్రాలో 24 గంటలు ఇవ్వడం లేదనే& ః దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బిజెపి పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు 24 గంటల కరెంటు కావాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకే తెలంగాణలో 24 గంటలు కరెంటు ఎత్తేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. 2004 లో నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఉమ్మడి రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిందని, కిరణ్ కుమార్ రెడ్డి
ఇఎంగా వున్నప్పుడు 7 గంటలు కూడా కరంటు ఇవ్వలేమని అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక అసెంబ్లీలో విద్యుత్ సమస్య వుందని ఎవరైనా మాట్లాడారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కరెంటు కోతలు,ఎండిన పంటలపై చర్చలు జరగలేదా? కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు క్రాప్ హాలిడేలు,పరిశ్రమలకు పవర్ కట్ చేయలేదా? అని నిలదీశారు. నాడు చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ వద్దు అంటే ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణలో 30 లక్షల వ్యవసాయ కరెంటు మీటర్లు ఉన్నాయని, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న దగ్గర డీజిల్ ఇంజన్లు ఉన్నాయని చెప్పారు. ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ పార్టీ వ్యాపార కోణంలో చూస్తుంటే , కెసిఆర్ మానవీయ కోణంలో చూస్తున్నారని అన్నారు.
నేడు నాణ్యమైన విద్యుత్ వస్తుంది కాబట్టే మోటార్లు కాలడం లేదన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కెసిఆర్ రూ. 37 వేల కోట్లు ఖర్చు పెట్టారని వివరించారు. ఉమ్మడి రాష్ర్టంలో పోలీసులు రాత్రి పూట నక్సలైట్లు అనుకుని రైతులను కాల్చి చంపిన చరిత్ర ఉన్నదని, కాంగ్రెస్ పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చశారు. రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా కాంగ్రెస్ నేతల మాటలు ఉన్నాయన్నారు.బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టం అని అసెంబ్లీలో కెసిఆర్ చెప్పారని, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టకపోవడం వలన తెలంగాణ కేంద్రం నుండి రూ.35 వేల కోట్లు నష్టపోయిందన్నారు.
దాసోజుకు బెదిరింపు కాల్స్పై ఏమి చెబుతారుః కాంగ్రెస్ విధానాలపై బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడితే బెదిరింపు ఫోన్స్ వచ్చాయని, రాజకీయంగా ఎదుర్కోక చేతకాక బెదిరింపులకు పాల్పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తుంది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.