HomeNewsBreaking Newsఒకేఒక్కడు!

ఒకేఒక్కడు!

ఓపెనర్‌గా తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన రోహిత్‌ శర్మ
హాఫ్‌ సెంచరీతో రాణించిన పూజారా
రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ దూకుడు
323 పరుగుల వద్ద డిక్లేర్‌
సఫారీల ముందు భారీ లక్ష్యం
ప్రస్తుతం 11/1
వైజాగ్‌ టెస్టు నాలుగో రోజు
విశాఖ : అమ్మమ్మ ఊరు.. అచ్చొచ్చిన స్టేడియం.. రోహిత్‌కు భాగా కలిసొచ్చింది. తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన హిట్‌మ్యాన్‌ పరుగుల వరద పారిస్తూ రికార్డుల మీద రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అటూ జట్టుకూ భారీ ఆధిక్యాన్ని అందించాడు. వైజాగ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికాకు టీమ్‌ ఇండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 323 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ భారత్‌ డిక్లేర్‌ చేసింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ(127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) మెరుపు శతకం, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) విజృంభించడంతో కోహ్లీసేన 67 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. రోహిత్‌, పుజారా జోడీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(40: 32 బంతుల్లో 3సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(31 నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రహానె(27 నాటౌట్‌: 17 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ముగ్గురు సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ భారీ షాట్లతో చెలరేగడంతో టీమ్‌ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 300కు పైగా స్కోరు చేసింది. అనంతరం ఆధిక్యం 390 దాటగానే సెకండ్‌ ఇన్నింగ్స్‌ను కోహ్లీ డిక్లేర్‌ చేశాడు. నాలుగో రోజు ఆటలో కనీసం 13 ఓవర్ల మ్యాచ్‌ మిగిలి ఉండటంతో ప్రత్యర్థిని లక్ష్య ఛేదనకు భారత్‌ ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే ఆట ముగిసేసమయానికి ఒకటి, రెండు వికెట్లను పడగొట్టాలని భారత్‌ భావిస్తోంది. రెండున్నర సెషన్లకు పైగా ఆటలో పూర్తిగా ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగింది. రోహిత్‌, పుజారా జోడీని విడగొట్టడంలో సఫారీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్లు తేలిపోయారు. పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసిన బ్యాటర్లు అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాది బౌలర్లపై ఒత్తిడి పెంచారు. సఫారీ బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. రబాడ, ఫిలాండర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.
సఫారీలు 431 ఆలౌట్‌..
అంతకుముందు 395 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు బ్యాటింగ్‌ దిగిన సఫారీలు ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి 400 పరుగులలోపే ఆలౌట్‌ అవుతుందని అందరూ భావించారు. కేషవ్‌ మహరాజ్‌(9) అశ్విన్‌ బౌలింగ్‌ పెవిలియన్‌ చేరగా రబాడా క్రీజులకి వచ్చాడు. ఈ పేస్‌ బౌలర్‌కూడా కొంచె కుదురుగా ఆడుతూ స్కోరు బోర్డును 400 పరుగులకు చేర్చారు. మరో బ్యాట్స్‌మెన్‌ ముతుసమితో కలిసి పదో వికెట్టుకు 35 పురుగుల జోడించి 431 వద్ద కసిగో రబాడా అశ్విన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో అంపైర్‌ అతన్ని ఎల్‌బిడబ్య్లూగా ప్రకటించడంతో సఫారీల తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా, సఫారీ బ్యాట్స్‌మెన్లు చివరి పదో వికెట్టుకు దాదాపు 9 ఓవర్లు ఎదుర్కొవడం విశేషం.
రోహిత్‌ రికార్డుల మోత..
ఈ టెస్టులో రోహిత్‌ శర్మకు ఇది వరుసగా రెండో సెంచరీ. మొత్తంగా టెస్టుల్లో రోహిత్‌ శర్మకు ఇది ఐదో సెంచరీ. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్టులో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ కెప్లర్‌ వెసెల్స్‌(208) పేరిట ఉన్న రికార్డుని రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. విశాఖ టెస్టులో రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేసి ఔటైన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒక టెస్టులో అరంగేట్రపు ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌(303) రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ఒక టెస్టులో మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు కొట్టిన రోహిత్‌ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 7 సిక్సులు బాదాడు. ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌ మాజీ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌(12 సిక్సుల) రికార్డుని బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో నాథన్‌ ఆస్ట్లే(11), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(11), మ్యాథ్యూ హెడెన్‌(11), బెన్‌ స్టోక్స్‌(11) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు భారత్‌ తరుపున ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా కూడా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల క్రితం నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నెలకొల్పిన రికార్డుని బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఔటైన తీరు కూడా అతడికి ఓ రికార్డుని తెచ్చిపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో ఔటైన రోహిత్‌ శర్మ…. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. రోహిత్‌ ముందుకొచ్చిన రెండు సందర్భాల్లోనూ వికెట్‌ కీపర్‌ డీకాక్‌ స్టంపౌట్‌ చేశాడు. ఒక టెస్టులో ఒకే బౌలర్‌కు ఒకే తరహాలో వికెట్‌ సమర్పించుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. అంతకుముందు విజయ్‌ హజారే, సునీల్‌ గావస్కర్‌(మూడుసార్లు), రాహుల్‌ ద్రవిడ్‌( రెండుసార్లు), కోహ్లి(ఒకసారి), రహానే(ఒకసారి) ఈ రికార్డును సాధించారు.
గాడిలో పడ్డ పూజారా ..
విండీస్‌ పర్యటనలో ఆచితూచీ రాణించిన పూజారా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సెలెక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు. టెస్టు స్పెషలిస్టుగా బరిలోకి దిగిన పూజారా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 17 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతనిలో ఏం మాత్రం ఆత్మ విశ్వాసం మొక్కవోలేదు. తేరుకొని రెండో ఇన్నింగ్స్‌లో భారీ హాప్‌ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 148 బంతులెదుర్కొన్న పూజారా అటు రోహిత్‌ సహకారమందిస్తూ 81 పరుగులు చేశారు. సెంచరీ వైపు దూసుకుపోతున్న పూజరా ఫిలందర్‌ బౌలింగ్‌లో పుజార ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌ అయ్యాడు. అప్పటికి భారత్‌ స్కోరు 51.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (94) జోరుమీదుండగా రవీంద్ర జడేజా (0) క్రీజులోకి వచ్చాడు.
నోరుజారిన రోహిత్‌..
దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో పరుగుల వరద పారిస్తున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. నాలుగు రోజు ఆటలో సహనం కోల్పోయాడు. తాను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. మరో ఎండ్‌లో ఉన్న చటేశ్వర్‌ పుజారాను తిట్ల దండకం అందుకున్నాడు. సింగిల్‌ తీసేందుకు పుజారా నిరాకరించడంతో సహనం కోల్పోయి నోటికి పనిచెప్పాడు. రోహిత్‌ పుజారాను తిట్టడం స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయింది. దీంతో పలువురు నెటిజెన్స్‌ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. స్పిన్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసేందుకు బంతిని పుష్‌ చేసిన రోహిత్‌.. సింగిల్‌ తీసేందుకు ఓ అడుగు ముందుకేశాడు. మరో ఎండ్‌లోఉన్న పుజారా కూడా ఓ అడుగు ముందుకేశాడు. ఇంతలో బంతి ఫీల్డర్‌ చేతిలోకి వెళ్లడంతో పుజారా సింగిల్‌కి ’నో’ చెప్పాడు. దీంతో సహనం రోహిత్‌ సహనం కోల్పోయి అసభ్య పదజాలంతో తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే, 71 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో బరిలో దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆటలోనూ ఆధిక్యం కనబరుస్తోంది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ధాటిగా ఆడి మరో సెంచరీ నమోదు చేశాడు.ప్రస్తుతం రవీంద్ర జడేజా(23),విరాట్‌ కోహ్లి(19) క్రీజులో ఉన్నారు. టీమిండియా 354 పరుగుల ఆధిక్యంలో ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments