HomeNewsBreaking Newsఐజెయుకు పిసిఐ గుర్తింపు

ఐజెయుకు పిసిఐ గుర్తింపు

ఐజెయు బహిష్కృత నేత సబీనాకు చుక్కెదురు
హైదరాబాద్‌ : అధ్యక్షులుగా కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌గా బల్విందర్‌ సింగ్‌ జమ్మూ నేతృత్వంలో కొనసాగుతున్న ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజెయు)నే అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ) చైర్మన్‌ జస్టిస్‌ సి.కె.ప్రసాద్‌ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. దీంతో ఐజెయులో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతూ సంఘాన్ని చీల్చేందుకు ప్రయత్నించి సస్పెన్షన్‌కు గురైన సబీనా ఇంద్రజిత్‌కు ప్రెస్‌ కౌన్సిల్‌లో చుక్కెదురైంది. పిసిఐలో ఐజెయు ప్రతినిధిగా కొనసాగుతూ ఇటీవల ఆకస్మీకంగా మృతి చెందిన ప్రభాత్‌ దాస్‌ (ఒడిషా) స్థానాన్ని భర్తీ చేసేందుకు సోమవారం నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఐజెయు సంఘం తమదేనని తమ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని సబీనా ఇంద్రజిత్‌, గీతార్ధ పాఠక్‌ నాయకత్వంలోని చీలికవర్గం కేరళకు చెందిన బషీర్‌ మాదాల, మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన బిజయ్‌ కాక్చింగ్‌టబమ్‌ పేర్లను ప్రతిపాదిస్తూ నామినేషన్‌ వేయించారు. అయితే పిసిఐ ఛైర్మన్‌ వాటిని తిరస్కరించారు. ఐజెయు బాధ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి, బల్విందర్‌ సింగ్‌తో పాటు ప్రెస్‌ అసోసియేషన్‌, వర్కింగ్‌ కెమెరామెన్‌ అసోసియేషన్‌, ఎన్‌యుజె(ఐ) కలిసి తమ మిత్ర సంఘమైన నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఎన్‌యుజె-ఐ)అభ్యర్థి ఆనంద్‌ రాణా పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌ దాఖలు చేయగా పిసిఐ ఛైర్మన్‌ దానిని స్వీకరించారు. ఐజెయు ఆవిర్భావం నుండి నేటి వరకు వివిధ రాష్ట్రాల్లో వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొన్న వ్యవస్థాపకులు కె.శ్రీనివాస్‌రెడ్డితో పాటు దేవులపల్లి అమర్‌, బల్విందర్‌ సింగ్‌ జమ్మూ, కె.అమర్‌నాథ్‌లు ఐజెయు నుంచి, ఎస్‌.ఎన్‌.సిన్హా డబ్ల్యుఎన్‌సిఎ నుంచి ప్రాతినిథ్యం వహించారు. దీంతో తన స్వార్థప్రయోజనాల కోసం ఐజెయును విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించిన సబినా ఇంద్రజిత్‌ వ్యవహరం మరోసారి బహిర్గతమైందని, పిసిఐ సమావేశానికి గీతార్ధ పాఠక్‌ ఉధ్దేశ్యపూర్వకంగానే గైర్హాజరైనట్లు స్పష్టంగా కనబడుతుందని ఐజెయు పేర్కొంది. సబీనాను నమ్ముకున్న పాపానికి కేరళకు చెందిన బషీర్‌ మాదాల, మణిపూర్‌కు చెందిన బిజాయ్‌లు బలిపశులయ్యారు.
ఐజెయు, టియుడబ్ల్యుజె హర్షం
ఐజెయును ప్రెస్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా (పిసిఐ) అధికారికంగా గుర్తించడం పట్ల ఐజెయు జాతీయ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ (టియుడబ్ల్యుజె) అధ్యక్షులు ఎన్‌.శేఖర్‌, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న ఐజెయును తమ స్వార్థ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే కొంత మందికి పిసిఐ నిర్ణయం చెంపపెట్టు లాంటిదని వారు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
సబీనాకు గుణపాఠం
ఐజెయును చీల్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఐజెయు బహిష్కృత నాయకురాలు సబీనా ఇంద్రజిత్‌కు సరైన గుణపాఠం దక్కింది. వివరాల్లోకి వెళ్తే, సంఘం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడలు అనుసరించిన సబీనా ఇంద్రజిత్‌ ఇటీవల ఐజెయు నుండి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే గతంలో ఇలాంటి వైఖరితోనే బహిష్కరణకు గురై, ఐజెయును చీల్చే ప్రయత్నం చేసి అబాసుపాలై, కనుమరుగైపోయిన సురేష్‌ కుమార్‌ అఖోరీ దారిలోనే సబీనాతో ఆమె మిత్ర బృందం ఐజెయును చీల్చే ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే ఐజెయూ తమదేనని ఐజెయు సీనియర్‌ నేతలు కె.శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్‌, కె.అమర్‌నాథ్‌, బల్విందర్‌ సింగ్‌ జమ్మూ, ఎస్‌.ఎన్‌.సిన్హా మరోసారి నిరూపించి సబీనాకు సరైన గుణపాఠం చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments