ఆరు పేపర్లతో నిర్వహణ
సైన్స్ మినహా ప్రతి పరీక్షకు 3 గంటల సమయ
ప్రజాపక్షం / హైదరాబాద్ పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నామని, ప్రతీ పరీక్షకు మూడు గంటల సమయాన్ని కేటాయిస్తామని ఆమె తెలిపారు. సైన్స్కు మాత్రం 3.20 గంటలు ఉంటుందని చెప్పా రు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై బుధవారం నాడు హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
నిర్వహించారు. వంద శాతం సిలబస్తో పరీక్షలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
టెన్త్ క్లాస్ పరీక్షలు షెడ్యూలు
తేదీ సబ్జెక్ట్
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 సెకెండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 ఇంగ్లీష్
ఏప్రిల్ 8 మ్యాథ్స్
ఏప్రిల్ 10 సైన్స్
ఏప్రిల్ 11 సోషల్
ఏప్రిల్ 12 ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్స్
ఏప్రిల్ 13 ఒఎస్ఎస్సి లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు
RELATED ARTICLES