జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేకంగా అస్సెట్ ప్రొటెక్షన్ సెల్
1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక కాల్ చేస్తే చాలు ప్రభుత్వ స్థలాలను కాపాడుతారు. ఇందు కు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జిహెచ్ఎంసిలో అంతర్భాగమైన విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఇవిడిఎం)లో ప్రత్యేకంగా అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ను ప్రారంభించింది. ఆదివారం ప్రగతి భవన్లో 1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్ను ప్రారంభించారు. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినా వెంటనే ప్రభుత్వానికి తెలిపేలా టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని కెటిఆర్ ప్రజలను కోరారు. 1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్కి పౌరులు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం అందించే వెసులుబాటుని అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ కల్పించనుంది. ఎవరైనా పౌరులు ఫిర్యాదు లేదా సమాచారం అందిస్తే వెంటనే ఒక ప్రత్యేకమైన ఫిర్యాదుగా నమోదు అవుతుంది. ప్రతి సమాచారానికి లేదా ఫిర్యాదుకు ప్రత్యేకంగా ఒక విశిష్ట సంఖ్యను కేటాయించడం జరుగుతుంది. ఈ విశిష్ట సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకునే వీలుంటుంది. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి సమాచారం వెళుతుంది. ఆయన తనకు అందిన సమాచారం లేదా ఫిర్యాదుపైన వెంటనే విచారణ మొదలు పెట్టి చెరువులు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను కబ్జాల నుంచి కాపాడే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఇందుకోసం జిహెచ్ఎంసి పరిధిలో జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. అయితే ఫిర్యాదు ఇచ్చే వ్యక్తి తాను కోరుకుంటే తన వివరాలు బయటకు రాకుండా గొప్యత పాటించే వెసులుబాటు ఈ ప్రక్రియలో కల్పించారు. ఈ మేరకు సమాచారం లేదా ఫిర్యాదు అందించిన వ్యక్తి వివరాలను బయటకి చెప్పకుండా గొప్యత పాటిస్తారని కెటిఆర్ వివరించారు. పార్కులు, చెరువులు, బహిరంగ ప్రదేశాల అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ అన్ని పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్, ఇవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ సిటీప్లానర్ ఎస్.దేవేందర్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక కాల్ చేస్తే చాలు..ప్రభుత్వ భూముల రక్షణ
RELATED ARTICLES