ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అభిప్రాయపడింది. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణపై చట్టం తీసుకురావాలని నిర్ణయించింది . వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టేందుకు వీలుగా అధ్యయనం చేసేందుకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి రూ.7,289 కోట్ల తో సిద్ధమైన ప్రణాళికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ర్ట కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, ధాన్యం కొనుగోలు, విద్యారంగ బలోపేతం, ఫారెస్ట్ యూనివర్సిటీ, మహిళా విశ్వవిద్యాలయం తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. తొలుత కరోనా పరిస్థితిపై చర్చ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు క్యాబినెట్కు రాష్ర్టంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ర్టంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ర్ట వైద్యారోగ్యశాఖ రాష్ర్టంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకోని వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ మంత్రిని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సిఎం ఆదేశించారు.
ఇక సర్కార్ స్కూలు, కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం
వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన సాగించాలని రాష్ట్రకేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ , డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రించేందుకు సిద్ధమైంది. ఈ రెండు అంశాల పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు వీలుగా మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రగతిభవన్లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కెటిఆర్ సభ్యులుగా ఉంటారు. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఇందుకు సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలకు రూ.7289 కోట్లుఃరాష్ర్టంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ‘ మన ఊరు- మన బడి’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు
వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కావొచ్చిందని, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదని, దీనిని దృష్ణిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తిగా అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
నేడు వరంగల్ జిల్లాలో సిఎం పర్యటన
అకాల వర్షాలతో పంట నష్టంపై పరిశీలన
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు సిఎం కెసిఆర్ మంగళవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్ తో పాటు పర్యటనలో పాల్గొంటారు.