ఈనెల మధ్యలో సమావేశాలు
కరోనా నష్టం రూ. 50 వేల కోట్లు
లక్ష కోట్లపై ప్రభావం
ఇప్పుడు రాబడి పెరిగింది
గతం కంటే కేటాయింపులెక్కువ
2021 22 బడ్జెట్పై సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర 2021 బడ్జెట్ ఆశాజనకంగా వుండనున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని శనివారం ప్రగతి భవన్లో నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలు మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సిఎం కెసిఆర్ వెల్లడించారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 50 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, దాని ప్రభా వం లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నదని తెలిపారు. కాగా కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రానున్న బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారమున్నదని సిఎం వెల్లడించారు. ఆర్థిక పద్దులలో పొందు పరచాల్సిన శాఖల వారీ బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను సిఎం పరిగణనలోకి తీసుకుని పరిశీలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా యాదవులు గొల్ల, కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి గాను, రానున్న బడ్జెట్లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సిఎం తెలిపారు. దేశంలోనే అత్యధికంగా గొర్రెలు వున్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సిఎం తెలిపారు. అదే విధంగా చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదని, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సిఎం అన్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు కేటాయింపులు కోసం విధి విధానాలు ఖరారయ్యాయని, ఆదివారం నుంచి రోడ్లు, భవనాలు, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , విద్యా, ఇరిగేషన్ తదితరర శాఖలతో సమావేశమై ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సిఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతారని సిఎం కార్యాలయం తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు , ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింజ్రావు, ఆర్ధిక సలహాదారు జిఆర్.రెడ్డి, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సిఎంఒ అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆశాజనకంగా బడ్జెట్
RELATED ARTICLES