HomeNewsBreaking News‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’కు రూ. 22,810 కోట్లు

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’కు రూ. 22,810 కోట్లు

ప్రస్తుత ఆర్థిక ఏడాదికి రూ.1,584 కోట్లు కేటాయింపు
దేశవ్యాప్త వైఫై పథకానికి ఆమోదం
పలు నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్‌
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా ఉద్యోగాల సృష్టికి ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, సంతోష్‌ గంగ్వార్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనలో భాగంగా కొత్తగా ఉద్యోగాలు కల్పించిన సంస్థలు, పరిశ్రమల తరఫున ఉద్యో గి, సంస్థ వాటాను కేంద్రమే భరిస్తుందని, 2023 వరకు ఈ పథకం అమలు చేస్తామని సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. దీనివల్ల 58.5 లక్షల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందన్నారు. 2020 అక్టోబరు 1వ తేదీ నుంచి 2021 జూన్‌ 30 వరకు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే ఈ పథకం వర్తిస్తుంది. ఈ కొత్త ఉద్యోగులు తమ నెలసరి వేతనంలో ఉద్యోగుల భవిష్య నిధికి చెల్లించవలసిన కంట్రిబ్యూషన్‌ 12 శాతం, అదేవిధంగా యజమానులు చెల్లించవలసిన 12 శాతం, మొత్తం 24 శాతం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. గరిష్ఠంగా 1,000 మంది ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. 1,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు యజమానులు చెల్లించవలసిన 12 శాతాన్ని ప్రభుత్వం చెల్లించదు, కేవలం ఈ సంస్థల్లోని ఉద్యోగులు చెల్లించవలసిన 12 శాతాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే విధంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వైఫై నెట్‌వర్క్‌ విస్తరణకు ఉద్దేశించిన పిఎం వాణి (వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌) పథకానికీ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. దేశంలో వైఫై విప్లవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కోటి డేటా సెంటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైఫై కోసం ఎలాంటి లైసెన్సులూ, రిజిస్ట్రేషన్లు ఉండబోవని చెప్పారు. దీంతో పాటు సముద్రం లోపల నుంచి సబ్‌మైరెన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ ద్వారా లక్షద్వీప్‌లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఇందుకోసం రూ.1,072 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలోని రెండు జిల్లాల్లో విస్తృత మొబైల్‌ కవరేజీకి ఉద్దేశించిన యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యుఎస్‌ఓఎఫ్‌)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 2,374 గ్రామాలకు మొబైల్‌ కవరేజీ అందించనున్నారు. 2022 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments