HomeNewsBreaking Newsఅప్రమత్తంగా ఉన్నాం

అప్రమత్తంగా ఉన్నాం

రాష్ట్రంలో కొత్త రకం కరోనా వైరస్‌ సోకిన వారెవరూ లేరు
రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలో కొత్త రకం కరోనా వైరస్‌ సోకిన వారెవ్వరూ లేరని, అయినప్పటికీ నూతన సంవత్సర వేడుక లు, సంక్రాంతి పండగకు బయట కు వెళ్లకుండా తమ కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్య శాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడూతూ కొత్త రకం వైరస్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసిందన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో అధికారులు అప్రమత్తమయ్యారన్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 22 వరకు వివిధ దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారందరినీ పర్యవేక్షణలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే సూచించిన విషయాన్ని తెలియజేశారు. యుకె నుంచి ఏడుగురు వచ్చారని, ఈ నెల 15 నుంచి 21 వరకు 358 మంది నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారని వివరించారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కరోనా టీకా డోసులు రాగానే ప్రణాళిక మేరకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్లను చైర్మన్లుగా జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామని, సుమారు 3 కోట్ల మేరకు టీక డోస్‌లను నిల్వ చేసేలా కోల్డ్‌ స్టోరేజ్‌లను విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు.
కొత్త వైరస్‌ వ్యాప్తి 70 శాతం
ప్రస్తుత కరోనా వైరస్‌ వ్యాప్తి 30 శాతం ఉంటే, కొత్త వైరస్‌ వ్యాప్తి 70 శాతం ఉన్నదని డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. గత నాలుగు వారాలుగా కరోనా వైరస్‌ తీవ్రత చాలా తక్కువగా ఉన్నదని, గడిచిన నెల రోజోలుగా వైరస్‌ అదుపులోనే ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 65 లక్షల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ప్రతి రోజూ 4 నుంచి 5 వందల పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని వివరించారు. అత్యంత తక్కువ స్థాయిలో యాక్టివ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు. న్యూ వేరియంట్‌ వైరస్‌ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కొత్త వైరస్‌ నేపథ్యంలో అన్ని శాఖలతో యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నామన్నారు. కొత్త వైరస్‌ పట్ల ఆందోళన అవసరం లేదని, ఇంతకు ముందు లాగే చికిత్స అంది స్తామని భరోసనిచ్చారు.
యుకె నుంచి వస్తే “040-24651119”ఫోన్‌ చేయండి
గత వారంలో యుకె నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినవారు ఎవరైనా ఉంటే వెంటనే ప్రజా ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 040-24651119 ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాలన్నారు. జిల్లా , రాష్ట్ర పర్యవేక్షణ బృందాలు వారి వద్దకే వెళ్లి వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అవసరమైతే ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 60 సంవత్సరాల పైపడిన వారు నూతన సంవత్సర వేడుకలకు, పండగలకు బయటకు వెళ్లొద్దని, రానున్న రెండు వారాలు గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. కొత్త వ్యక్తులతో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని నాలుగైదు వారాల్లోనే కొరొనా వ్యాక్సిన్‌ అందుబాటులోనికి వస్తోందన్నారు. యూరప్‌, ఆస్ట్రేలియా, సౌదీలో కొత్త వైరస్‌ వ్యాప్తి ఉన్నదన్నారు. డైరక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ కొత్త వైరస్‌ లు వచ్చినప్పుడు మ్యుటేషన్‌ జరగడం సాధారణమన్నారు. కొత్త వైరస్‌ సోకిన వారిని ప్రత్యేకంగా పెట్టి చికిత్స అందిస్తామన్నారు. ఇప్పటికే యుకె నుంచి వచ్చిన వారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండడం మంచిదని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments