HomeNewsBreaking Newsవాణిజ్యయుద్ధం తీవ్రరూపం!

వాణిజ్యయుద్ధం తీవ్రరూపం!

ఇయుతోనూ ట్రంప్‌ గొడవ
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య వ్యూహాలు మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఓవైపు తారాస్థాయికి చేరుకోగా, తాజాగా యూరోపియన్‌ యూనియన్‌తోనూ ఆయన వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. జి7 సదస్సులో ఇయుతో ఆయన తాడోపేడో తేల్చుకున్నారు. ఇప్పటికే చైనాతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఇటీవల అమెరికా విధించిన అదనపు సుంకాలకు ప్రతిగా ఆ దేశానికి చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై చైనా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్‌… చైనాలోని అమెరికా కంపెనీలన్నీ తిరిగి వచ్చేయాలంటూ ఆదేశించడంతో ట్రేడ్‌ వార్‌ కాస్తా ఊహించని మలుపు తిరిగింది. చైనా తాజాగా విధించిన సుంకాలపై తాను శుక్రవారం మధ్యాహ్నం స్పందిస్తానంటూ ట్విటర్లో ప్రకటించిన ట్రంప్‌… మధ్యాహ్నమే వాణిజ్య విభాగంతో చర్చలు జరిపినట్టు వైట్‌ హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ట్రంప్‌ ట్వీట్‌ చేస్తూ.. “మాకు చైనా అక్కర్లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్లతో సంబంధం లేకుండా ఉంటేనే మాకు బెటర్‌. అమెరికా నుంచి చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రతియేటా పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొడుతోంది. దీన్ని ఇక ఆపాల్సిందే..” అని పేర్కొన్నారు. అమెరికాకి చెందిన కంపెనీలన్నీ వెంటనే చైనాను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆదేశించినట్టు ట్రంప్‌ ప్రకటించారు. “మన ప్రఖ్యాత కంపెనీలన్నీ స్వదేశానికి తరలిరావాలని ఆదేశిస్తున్నాను. మీ ఉత్పత్తులన్నీ అమెరికాలోనే తయారుచేయండి..” అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. చైనాలోని అమెరికా కంపెనీల మూసివేతకు, ఆ దేశంలో ఉత్పత్తుల నిలిపివేతకు ట్రంప్‌ ఏ అధికారాలతో ఆదేశించారన్నది ఇంకా తెలియరాలేదు. ఫెడ్‌ఎక్స్‌, అమెజాన్‌, యూపీఎస్‌, యూఎస్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ సహా రవాణా కంపెనీలకు సైతం ట్రంప్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చైనా నుంచి వచ్చే ఓపియాయిడ్‌ ఫెంటానిల్‌ దిగుమతుల్లో ఏ ఒక్కటీ అమెరికాకి చేరకుండా నిలిపివేశారు.
భారీగా టారిఫ్‌ పెంపు:
అమెరికా వస్తువులపై టారిఫ్లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన ట్విటర్‌ కరవాలాన్ని చైనాపై దూశారు. చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ టారిఫ్‌లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు 25శాతం టారిఫ్ల పరిధిలో ఉన్నాయి. వీటిని ట్రంప్‌ 30శాతానికి పెంచారు. అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక మరో 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారిఫ్లను 10శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఇవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించారు. శుక్రవారం అగ్రరాజ్యానికి చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని తాజాగా చైనా ప్రకటించడం ఇందుకు కారణం. వ్యవసాయం, ఇంధనం, చిన్న తరహా విమానాలు, కార్లు.. ఇలా మొత్తం 5,078 వివిధ రకాల అమెరికా దిగుమతి ఉత్పత్తులపై ఐదు నుంచి పదిశాతం అదనపు సుంకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments