అటవీ హక్కుల చట్టం -2006 ప్రకారం ‘పోడు భూముల హక్కు’ పత్రాలివ్వాలి
తిరస్కరించిన పోడుభూముల దరఖాస్తులను పునః పరిశీలించాలి
ఆదివాసి అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఇందిరాపార్కు
ప్రజాపక్షం/హైదరాబాద్ అటవీ హక్కుల చట్టం -2006 ప్రకారం అందరికీ ‘పోడు భూ ముల హక్కు’ పత్రాలు ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తిరస్కరించిన పోడుభూముల దరఖాస్తులను పునః పరిశీలించి, ప్రకారం అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వా లన్నారు. ‘ఆదివాసి అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ’ ఆధ్వర్యంలో హైదరాబాద్, ఇందిరాపార్కు సోమవారం మహాధర్నాను నిర్వహించారు. ఈ మహాధర్నకు అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ భాగస్వామ్య రాష్ట్ర కన్వీనర్లు వేములపల్లి వెంకట రామయ్య, రమావత్ అంజయ్య నాయక్, రంగయ్య, రమణాల లక్ష్మయ్య, శ్రీరాం నాయక్ తదితరులు అధ్యక్ష వర్గంగా వ్యవహారించగా ధర్నాను ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభించారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్, టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి, ఛిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకం టి రంగారెడ్డి,ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సుధాకర్, టిడిపి రాష్ట్ర ప్రతినిధి అనంత రెడ్డి, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ఆంక్షలు, నిబంధనల పేరుతో పోడు భూములపై ఆధారపడిన వారిని అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిపైన పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని, అర్హులైన వారందరికీ పోడు పట్టాలు ఇస్తామని సిఎం కెసిఆర్ హామీనిచ్చినప్పటికీ తీవ్ర జాప్యం జరుగుతోందని, మరోవైపు ఆంక్షల పేరుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పోడుసాగు చేసుకుంటున్న వారిని పోలీసులు, అధికారులు వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివాసి హక్కులను కాపాడాల్సిన గవర్నర్, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ పోడు సమస్యను పరిష్కరించకపోతే మరోసారి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. మల్లు రవి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని లెక్కచేయడం లేదని విమర్శించారు. పోడురైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. అసమానతలను తొలగిస్తామని చెప్పి అధికారంలోనికి వచ్చిన మోడీ, ఉన్న సమస్యలన పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారన్నారు.
ఉపగ్రహ ఛాయ చిత్రాలు తియాలని చట్టంలో ఉన్నదా?: పశ్మపద్మ
ఉపగ్రహా ఛాయ చిత్రాలు కావాలని అటవీ హక్కు చట్టంలో ఉన్నదా? అని పశ్యపద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడుపట్టాల కోసం పెట్టుకున్న ధరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరితహారంలో పెట్టిన మొక్కలు ఎన్ని బతికాయని,?, రైతుల వేసే మొక్కలు మొక్కలు కావా?, వాటి ద్వారా వాతావరణ పరిరక్షణ ఉండదా అని ప్రశ్నించారు. చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికీ పోడు హక్కు పత్రాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రమావత్ అంజయ్య నాయక్ మాట్లాడుతూ ఆదివాసి, గిరిజనులు సాగు చేసుకుంటున్నా పొడు భూములన్నింటికీ మొత్తం 11.30 లక్షల ఎకరాలకు ఈనెలాఖరు వరకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూముల అంశంలో సిఎం కెసిఆర్ గతంలో చేసిన అనేక వాగ్ధానాల తరహా ప్రచారానికే పరిమితం కావొద్దని సూచించారు. అటవీ హక్కుల చట్టం కేవలం ఆదివాసీ గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలకు మాత్రమే కాదని, దేశంలోని అన్ని అడవి ప్రాంతాలకు వర్తించే చట్టమని తెలిపారు. 75 సంవత్సరాల నుండి సాగు చేస్తూ ఉండాలని ప్రభుత్వం తప్పుగా చట్టాన్ని వక్రీకరిస్తోందన్నారు.కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ 2022. ను భేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్లు ప్రసాద్ అన్న. మండలవెంకన్న. జక్కుల వెంకటయ్య. మామిడాల బిక్షపతి. వి ప్రభాకర్, తెలంగాణ గిరిజన సమాఖ్య నాయకులు వెంకటయ్య శీను నాయక్. మెస్రం భీమ్రావు . గెడం కొచ్చిరామ్ . కొడప సురేష్. తదితరులు పాల్గొన్నారు.